తెలంగాణ భవన్ లో సెప్టెంబర్ 17, జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు
తెలంగాణ భవన్లో జరిగిన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీ నేతలు జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
కేటీఆర్ గారి ప్రసంగం
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది. కొంతమంది దీనిని విమోచనమని, విలీనం అని అన్నా, వేలాది మంది ఆనాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారు.
ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ మా పార్టీ తరపున శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాం.
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ. ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం… అన్నింటినీ తెలంగాణ చూసింది.
చాకలి ఐలమ్మ, షేక్ బందగి, రావి నారాయణరెడ్డి వంటి అద్భుతమైన అమరవీరులను ఈ తెలంగాణ కన్నది.
తెలంగాణలో మరోసారి సంక్షేమ, అభివృద్ధి రాజ్యం రావాలని, నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక రాజ్యం రావాలని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటాం.
గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసింది.
ఒకవైపు రైతన్నలు యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నది.
ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుంది.
ఈ రోజును సమైక్య దినోత్సవంగా జరుపుకుందాం.
ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది.
