మిర్యాలగూడ ప్రజాలహరి
ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలానికి సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లు తక్షణమే బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.
శనివారం ఆమె నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమర్పించని మిల్లర్లు తక్షణమే బ్యాంకు గారెంటీలు సమర్పించాలని కోరారు.
ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానకాలం ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు వారి మిల్లులలో దించుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలు, పంట మీద దాన్యం తడిసిపోయేందుకు అవకాశం ఉన్నందున నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని దించుకోవడంలో జాప్యం చేయకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకొని రైతులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్ ను సందర్శించి అక్కడ ధాన్యం ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. అంతేకాక బాయిల్డ్ రైసు, డ్రైయర్స్ తదితర అంశాలను మిల్ ఓనర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ బాబి, అధికారులు, మిల్లర్లు ఉన్నారు .*
