
( ప్రజాలహరి ) ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
🔹 దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో ఇన్ఫోసిస్ (Infosys Limited) సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్క గారు చర్చలు జరిపిన అనంతరం పెట్టుబడుల విస్తరణకు అంగీకారం కుదిరింది.
🔹 ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది.
🔹 వచ్చే రెండు మూడేండ్ల లో ఈ నిర్మాణం పూర్తవుతుంది, ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుంది.
🔹 ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో దాదాపు 35,000 మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని, ఇప్పుడున్న ఐటీ సమూహాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని జయేష్ సంఘ్రాజ్క గారు అన్నారు.
🔹 రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు.