ముస్లిం కుటుంబాలకు బాసటగా ‘మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్’
* రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కిట్ల పంపిణి అభినందనీయం
*యువత సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి :
మిర్యాలగూడ ప్రజాలహరి
పవిత్ర రంజాన్ మాసంలో పలు ముస్లిం కుటుంబాలకు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు బాసటగా నిలవడం ఆదర్శనీయమని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కొనియాడారు. రంజాన్ పండుగ సందర్భంగా పలు ముస్లిం కుటుంబాలకు హమీద్ షేక్ చేతుల మీదుగా రైస్ మిల్లర్లు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని కొనియాడారు. సర్వమత సమానత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో కొన్ని ముస్లిం కుటుంబాలకు తమ వంతుగా సాయమందిస్తున్నారని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పలు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సహృద్భావంతో, సేవానిరతితో అనేక మంది యువతలో ఆర్యవైశ్యులు స్ఫూర్తి నింపారని అన్నారు. తాజాగా, 15 ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారని చెప్పారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాలకమండలి తరఫున హమీద్ షేక్ ముస్లిం సోదరసోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో ప్రతీ ఒక్కరూ నెలరోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టాలని, ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్ధించాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు, స్వచ్చంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని హమీద్ షేక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసూద్, గబ్బార్, అహ్మద్, నబీ, జానీపాషా, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.