ఎమ్మెల్సీ ఓటుకు అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి.. ఆర్డిఓ చెన్నయ్య
వేములపల్లి జనవరి 27 (ప్రజాలహరి): తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానానికి త్వ రలో జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్డిఓ చెన్నయ్య కోరారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి అధికారులకు తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ ఓటుకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 6 వరకుగడువు తేది అని 31-10-2020కి ముందు పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని,వెరిఫికేషన్ కోసం వచ్చే అధికారులకు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ తోపాటు డిగ్రీ ఒరిజినల్ మెమో చూపించాలన్నారు. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, డిగ్రీ మెమో జిరాక్స్ కాపీలను సమర్పించాలన్నారు. జనరల్ మిర్యాలగూడ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల తుది జాబితా ఫిబ్రవరి 8 న విడుదల చేస్తారని, మండలంలో ఖాళీగా ఉన్న తిమ్మారెడ్డి గూడెం, రావులపెంట రెండు రేషన్ దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని, అన్ని రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస శర్మ, డీటీ నిర్మలాదేవి, ఆర్ఐలు మహేందర్ రెడ్డి, స్పందన, సిబ్బంది తదితరులు ఉన్నారు.