శెట్టిపాలెం పరిదిలోని మిల్లర్ల మాయాజాలం
— ట్రాక్టర్ లోడు తూకంలో వే బ్రిడ్జిల మద్య వ్యత్యాసం.
— లోడు కు క్వింటాళ్ల కొద్దీ తేడాతో తూకంలో మోసం,
— తేమ శాతం పేరుతో మిల్లరు తక్కువ ధరతో నిలువు దోపిడి,
— ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను నిలువునా ముంచుతున్న మిల్లర్లు
— నిద్రావస్థలో తూనికలు, కొలతల శాఖ.
— కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ.
వేములపల్లి, నవంబర్ 14:
ఖరీఫ్ సీజన్లో వరుణ దేవుడు కరుణించక పోవడంతో సాగర్ జలాశయంలో నీరు లేక అనేక పంట పొలాలు బీళ్లుగా మారిపోయాయి. అందుబాటులో ఉన్న బోర్ల నీటి సాయంతో అరకొరగా పంటలు సాగు చేసి ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులను మండల పరిధిలోని మిల్లర్లు దాన్యం కొనే విషయంలో తేమ పేరుతో ధర విషయంలోనూ, అక్రమ పద్ధతుల్లో వే బ్రిడ్జిల తూకంలో మోసంతోనూ నిలువునా ముంచుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోమవారం మండలానికి చెందిన ఓ రైతు తాను పండించిన పంటను లోడు చేసుకొని మండల పరిధిలోని ఓ మిల్లుకు రాగా స్దానిక మిల్లరు అందుబాటులోని శాంతి వే బ్రిడ్జి కాంటాలో తూకం చేసుకొని రమ్మని సూచించారు. రైతు తన దాన్యం తూకం వేయగా లోడు వడ్లు గ్రాస్ వెయిట్ తో 6870 క్వింటాళ్ల తూకం వచ్చాయి.ఆ దాన్యాన్ని ఖరీదు దారు అయిన మిల్లరు తేమ శాతం లో డ్రై ఎక్కువ ఉన్నాయని క్వింటాళు కు రూ.2000/- ధర నిర్ణయించాడని రైతు వాపోయాడు. కాగా సదరు రైతు అదే దాన్యం తీసుకొని మిర్యాలగూడ పట్టణంలోని మరో మిల్లుకు పోగా అక్కడి వే బ్రిడ్జి కాంటాలో అదే లోడు గ్రాస్ వెయిట్ 6920 తూకం వచ్చాయని తెలిపాడు. ఖరీదులోనూ క్వింటాళు కు రూ.2710/- ధర నిర్ణయించగా దాన్యాన్ని అమ్ముకొని వచ్చానని పేర్కొన్నాడు.
మండలం పరిధిలోని పంట పొలాలను పారిశ్రామిక అభివృద్ధి పేరుతో మిల్లులుగా మారుస్తున్న వ్యాపారులు అదే మండలం పరిధిలో పంటలు పండించే రైతులను తూకాలలో మోసంతోనూ, తేమ శాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయించి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దగా చేస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంటల కోతల సమయంలో ఆయా మిల్లుల్లోని, మిల్లుల పరిధిలోని వే బ్రిడ్జిలపై తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వే బ్రిడ్జి కాంటాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై తూకంలో వ్యత్యాసం చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఖరీదు విషయంలోనూ ఉన్నతాధికారులు స్పందించి ఆయా మిల్లుల్లో దాడులు జరిపి రైతులకు ఎదురయ్యే మోసాలను నిలువరించాలని పలువురు రైతు సంఘాల నేతలు, రైతులు కోరుతున్నారు.