
ధరణిని రద్దు చేస్తే.. మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది : సీఎం కేసీఆర్
అచ్చంపేట : రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు.ధరణి పోర్టల్లో రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఆ వివరాలు ఉన్నందునే రైతుబంధు నగదు నేరుగా మీ ఖాతాలో పడుతోంది. వడ్లు అమ్మిన తర్వాత కూడా మీ బ్యాంకులో డబ్బులు నేరుగా పడుతున్నాయి. గత ప్రభుత్వాల్లో వడ్లు అమ్మితే నెలకు, రెండు నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పైరవీకారులు, దళారులు లేరు. ఒక వేళ ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది. వీఆర్వోలు, గిర్దావర్లు వస్తరు. మళ్లా ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. మళ్లీ పాతక కథ మోపైతది. రిజిస్ట్రేషన్లు ఈజీ అయ్యాయి. మండల కేంద్రాల్లో 15 నిమిషాల్లో అయిపోతున్నాయి. వెంబడే ఆన్లైన్లో మీ భూమి ఎక్కుతుంది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టా 15 నిమిషాల్లో అయిపోతుంది. ఇవన్నీ తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎందుకంటే దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు. ఈ దుర్మార్గులను రానిస్తే, రైతుబంధుకు రాంరాం.. దళితబంధు జైభీం అవుతుంది. అప్పుడు కేసీఆర్ను తిట్టినా లాభం లేదు. మీరు ఇవన్నీ ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు. మనిషన్నప్పుడు మంచి చెడు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. తిట్టేడు కూడా ఉంటడు. అలాంటి వారు ఎప్పటికీ ఉంటారు. నిజనిజాలు గుర్తించాలి. తెలంగాణ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్గా ఉన్నాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లను పండిస్తున్నది తెలంగాణ. ఇది 4 కోట్లు కావాలి.. ఈ ముండవోపులు వచ్చి 2 కోట్లకు తీసుకుపోతరు అని కేసీఆర్ పేర్కొన్నారు. మేం ఉట్టి మాటలు చెప్పలేదు. నరకలేదు. ఒక చిత్తశుద్ది, నిజాయితీ ఉంటేనే సంక్షేమ, అభివృద్ధి సాధ్యమవుతుంది. మన ఇంటి సంసారం మాదిరిగానే శ్రద్ధతో చేస్తే ఇక్కడి దాకా వచ్చాం. అచ్చంపేట నియోజకవర్గానికి పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో మంజూరు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.24 ఏండ్ల నాడు ఎవరు లేరు. ఇవాళ లేచినోడు లెవ్వనోడు లేచి కేసీఆర్ నీకు దమ్మున్నదా..? కేసీఆర్ డంగల్కు రా అని ఒకడు.. నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు.. అసలు ఇవి సవాళ్లేనా..? ఇది రాజకీయం అవుతుందా..? రాజకీయం అనుకోవచ్చునా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. అప్పుడే బతుకులు బాగుపడుతాయి అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో ఇవాళ మాట్లాడే సిపాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు.రైతుబంధు, దళితబంధు సృష్టికర్తను నేనే.. కాంగ్రెస్కు ఓటేస్తే ఆ రెండూ ఖతమే : సీఎం కేసీఆర్
అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆగమై కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ రెండు పథకాలు ఆగిపోతాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆలోచించి ఓటేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రైతుబంధు అనేది ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. అప్పులు చెల్లించకపోతే బ్యాంకు వాళ్లు వచ్చి తలుపులు తీసుకోవడం, మెడమీద కత్తి పెట్టడం తప్పా.. రైతుల గురించి ఆలోచించలేదు. ఈ సమాజం మళ్లీ పురోగతి రావాలి. రైతుల ముఖాలు తెల్లపడాలి. గ్రామాల్లో ధాన్యం రాశులు రావాలని రైతుబంధు తెచ్చిందే కేసీఆర్. ప్రస్తుతం రూ. 10 వేలు ఇస్తున్నాం.. దాన్ని రూ. 16 వేలకు తీసుకెళ్తాం. ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్తున్నాం. ఓట్ల కోసం హామీలు ఇవ్వడం లేదు. ఇవాళ తెలంగాణ అన్నపూర్ణ అయింది. ఇలాంటి రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలని చెప్పి.. సన్నబియ్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చి తీరుతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. నేను ఎంతగానం కొట్లాడాలి.. ఇక మీరు కొట్లాడాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇరిగేషన్ సదుపాయం పెరగాలి. ఉమా మహేశ్వర లిప్ట్ మంజూరు చేసుకున్నాం. మూడు రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం. అప్పర్ ప్లాట్కు కూడా నీళ్లు ఇస్తాం. 2 లక్షల ఎకరాలకు తప్పకుండా నీళ్లు తెచ్చి ఇస్తాం. పనులు మొదలు కాబోతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కడితే అడ్డం పడ్డదే కాంగ్రెస్ నాయకులు. 192 కేసులు వేశారు. కేసులు క్లియర్ అయ్యాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే కొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది అని కేసీఆర్ తెలిపారు. మనకు కులం లేదు, మతం లేదు అని సీఎం స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి తెచ్చాం. బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అందర్నీ ఆదుకుంటున్నాం. వెయ్యికి పైగా గురుకులాలు స్థాపించాం. వాటిని అప్గ్రేడ్ చేస్తాం. దయచేసి ఎన్నికల్లో ఆగం కావొద్దు. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు పోతదో ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఎంతో మందిని కాంగ్రెస్ కాల్చి చంపింది. 1969లో 400 మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని జైల్లో వేశారు. 2004లో పొత్తు పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2014 దాకా తెలంగాణ ఇవ్వలేదు. మనల్ని ఏడిపించారు. తాను ఆమరణ దీక్ష పెడితే.. కేసీఆర్ శవయాత్రానా.. తెలంగాణ జైత్రయాత్రానా అని నినాదిమిస్తే తెలంగాణ వచ్చింది. 32 పార్టీల మద్దతు కూడగొట్టి.. తొక్కిపారేస్తాం అని హెచ్చరిస్తే ఇవ్వక తప్పదని తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బాగోగులు అవసరం లేదు.. తెలంగాణ మీద పెత్తనం కావాలి వారికి అని కేసీఆర్ మండిపడ్డారు.