
మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోడీ, అమిత్ షా వద్ద తాకట్టు పెట్టిన రాజ్ గోపాల్ రెడ్డి
* 20న నిర్వహించే కేసీఆర్ ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలి : మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ప్రజాలహరి..
మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోడీ, అమిత్ షా వద్ద కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తాకట్టు పెట్టారని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే రాజీనామా చేసిన అని గొప్పలు చెప్పుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచే తిరిగి పోటీ చేయాలని అన్నారు. అయితే,ఆయన స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. గురువారం చౌటుప్పల్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలతో ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే ప్రగాఢ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసిన ఆయన్ను ప్రజలు గెలిపించారని అన్నారు. కానీ, ఆయన కాంట్రాక్టులను దక్కించుకునే దురుద్దేశంతో బీజేపీ పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. రాజకీయాలను వ్యాపారంగా మలుచుకోవడం ఆయనకు కొత్త ఏమీ కాదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని భాస్కర్ రావు కోరారు. ఈనెల 20న మునుగోడులో నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త మునుగోడు నియోజకవర్గంలోని గడపగడపకు వెళ్లి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమాల గురించి, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. స్వలాభం కోసం మునుగోడు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని భాస్కర్ రావు కోరారు